Monday, April 11, 2011

బలవంతుడికి భయమేల?


తమ నాయకుడు దైవాంశ సంభూతుడని, ఆంధ్రప్రదేశ్ సామ్రాజ్యానికి యువరాజు, సింహాసనం అధిష్టించే అర్హత గల ఏకైక వీరుడు అని నిత్యం కీర్తించే ఆయన అనుచరగణానికి ఒక్కసారిగా ఆయన శక్తి, సామర్థ్యాలపై సందేహం వచ్చినట్లుంది. తమ యువరాజు ఎంతమంది శత్రువులనైనా ఒంటిచేత్తో మట్టికరిపించగలడని, కడప సంస్థానంతో దండయాత్ర ప్రారంభించి 294 ఉప సంస్థానాలను జయించి సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడని నిన్న మొన్నటి దాకా ధీమాగా ఉన్న ఆయన సైన్యం... ఇప్పుడు తమపైకి శత్రుసైన్యం దూసుకొస్తోందని బెంబేలెత్తుతోంది. కడప ఉప ఎన్నికలకు మంత్రులను ఇంచార్జులుగా నియమించగానే ఆ అనుచరగణమంతా కాంగ్రెస్ పార్టీ మీద విరుఝుకుపడుతున్నారు. మంత్రులు పాలనను గాలికి వదిలేసి ఉప ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారని, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిత్యం జగన్నామస్మరణ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఒక వ్యక్తిని ఓడించేందుకు ఇంత హంగామా అవసరమా? అంటూ వాపోతున్నారు. తమ నాయకుడు వ్యక్తి కాదు.. శక్తి అన్నవారు ఇంతలోనే ఆయనను ఒక్క వ్యక్తిగా అభివర్ణించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా గెలుపు కోసం రకరకాల వ్యూహాలు పన్నడం, మందీ మార్బలాన్ని మోహరించడం సహజమేనన్న విషయాన్ని మరిచిపోయి.. అసలు తమకు పోటీగా ఎవరూ నామినేషన్ కూడా వేయవద్దు, వేసినా.. గెలుపుకోసం ఎటువంటి ప్రయత్నాలు చేయవద్దు అని కోరుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ప్రత్యర్థులు ఎన్న అస్త్ర, శస్త్రాలను ఎక్కుపెట్టినా వాటినన్నటినీ తుత్తునియలు చేసి విజయుడిగా నిలిచినప్పుడే కదా... ప్రజాబలం ఉన్న నేతగా గుర్తించబడేది! అది వదిలిపెట్టి వారు ఇంతమంది ప్రచారం చేస్తున్నారు.. వీరు అంతమంది చేస్తున్నారు, ఫలానా వారు ఫలానా వారితో కుమ్మక్కయ్యారు.. అంటూ పసలేని ఆరోపణలు చేస్తున్నారు.
ఇక మీడియాలో కథనాలు సరేసరి..! తనది సొంత మీడియా కాబట్టి ఏదైనా రాసుకుంటాడు. ప్రజల చేత చదివిస్తాడు. వాటిని చదివిన వారంతా వాటిని నిజమేనని నమ్ముతారనుకుంటాడు. ఆయన మీడియా సంగతి అలా ఉంచితే ... ఇతర వార్తా చానెళ్ల మాటేమిటి? కడప ఉప ఎన్నికల ఇంచార్జులుగా మంత్రులను నియమించగానే.. పరిపాలన స్థంభించి పోయిందని, మంత్రులు తమ బాధ్యతలను వదిలేసి ఎన్నికల ఇంచార్జులుగా వెళ్లడమేమిటని ప్రశ్నిస్తూ, ఈ విషయంపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఊదరగొడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలను ఎన్నికల ఇంచార్జులుగా నియమించడం ఇదే మొదటిసారి కాదుకదా..! గతంలో పలు సందర్భాల్లో ఇటువంటి వ్యూహాలను అమలుపరిచినపుడు ఈ చానెళ్లు ఎందుకు నోరు మెదపలేదు..?  వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కరీంనగర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పోటీ చేసినప్పుడు నియోజకవర్గానికో మంత్రిని, మండలానికో ఎమ్మెల్యేను ఇంచార్జిగా నియమించిన విషయం మరిచిపోయారా..? ఆనాడు ఏ ఒక్క చానెల్ వారు కూడా ఈ విషయం ప్రస్తావించలేదెందుకు? ఒకరు చేస్తే ప్రజాస్వామ్యయుతమైనది, అదే పనిని మరొకరుు చేస్తే ప్రజాస్వామ్య విరుద్ధమైనదా..? బాధ్యత అందరి విషయంలోనూ ఒకే రకంగా ఉండాలి. అప్పుడే ఆ చానెళ్లకు విశ్వసనీయత పెరుగుతుంది.

1 comment:

  1. anna blog nadipinchu. enduku madhyalo post lu pettadam ledu. theenmaar explanation bagundi. nuv review raaste inka baaguntadi.

    ReplyDelete