Friday, April 8, 2011

ఈ దృశ్యం మళ్లీ ఎప్పుడో..!




క్రికెట్‌లో భారత్ విశ్వవిజేతగా అవతరించిన క్షణాన సారథి ధోనీ.. తన సహచర ఆటగాళ్లతో ఆనందం పంఝుకుంటున్న దృశ్యమిది. కోట్లాది అభిమానులు 28 ఏళ్లుగా కంటున్న కలలు సాకారమైన క్షణమది. టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి, బలమైన జట్లను మట్ట కరిపించి నూతన చాంపియన్‌గా అవతరించింది.. టీమిండియా. ఈ  క్రమంలో జట్టు సాధించిన విజయాలు ఇంకా అభిమానుల కళ్లముందు కదలాడుతున్నట్లుగానే ఉన్నాయి. ప్రత్యేకించి క్వార్టర్‌ఫైనల్లో ఆస్ట్రేలియాను, సెమీఫైనల్లో పాకిస్తాన్‌ను, పైనల్లో శ్రీలంకను చిత్తుచేసిన భారత క్రికెట్ వీరుల పరాక్రమాన్ని అభిమానులు అంత తొందరగా మరచిపోలేరు. 121 కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతినిధులుగా.. దేశం తరపున ఆడిన ఆటగాళ్లు తమ సర్వశక్తులూ ఒడ్డారు. దేశమంతా  జాతీయభావం పొంగి పొర్లింది. ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లకు నజరానాలూ భారీగా అందాయి. ఎక్కడ ఝూసినా ధోనీసేన విజయగాథలే వినిపిస్తున్నాయి. అవి ఇంకా పూర్తి కానేలేదు. కానీ, ఇంతలోనే విచిత్రమైన పరిస్థితికి తెరలేచింది. ప్రపంచకప్‌లో ఐక్యంగా ప్రత్యర్థులను మట్టికరిపించిన అదే ఆటగాళ్లు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారనున్నారు. ఐపీఎల్ ఇప్పుడే ప్రారంభమైనది కాకపోయినా.. జాతీయ జట్టులో ఆడే ఆటగాళ్లు వివిధ జట్ల తరపున ఆడడం సాధారణ విషయమే అయినా.. ప్రపంచకప్ నెగ్గిన ప్రస్తుత సందర్భంలో ఇంత త్వరగా ఆటగాళ్లు విడిపోయి ఆడడం అభిమానులను కాస్త నిరాశపరిచే విషయమే. ఎందుకంటే జట్టుగా భారత ఆటగాళ్లు సాధించిన విజయాలను మరికొద్ది రోజులు నెమరు వేసుకోవాలని సగటు అభిమాని కోరుకున్నాడు. ఐపీఎల్ వచ్చి ఆ ఆనందం లేకుండా చేస్తోందని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment